శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం (Sri Omkareshwar Jyotirlingam )
కావేరికా నర్మదయోహ పవిత్రే, సమాగమే సజ్జనతారనాయ |
సదివ మాదాత్రుపురే వసంత, మొన్కారమీశం శివమేకామీడే ||
ఓంకార జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లో పవిత్ర నర్మదా నదీ తీరం లో ఉంది ఈ ప్రదేశం లో నర్మదా నది రెండు పాయలుగా చీలి మధ్యప్రదేశం ఒక ద్వీపంగా ఎర్పడింది. ఈ ద్వీపాన్ని మాంధాత పర్వతం అని శివాపురం అని అంటారు. నది నుంది ఒక పాయ పర్వతానికి ఉత్తరం వైపు గా, మరో పాయ దక్షిణం వైపు గా ప్రవహిస్తుంది, దక్షిణం వైపు ప్రవహించేదే ప్రధాన పాయ గా గుర్తించబడుతుంది. ఈ మాంధాత పర్వతం మీద ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నెలకొని ఉంది. ప్రాచీన కాలంలో మాంధాత మహారాజు ఈ పర్వతం మీద గొప్ప తపస్సు చేసి శివ భగవానుని ప్రసన్నం చేస్కున్నాడు. ఓంకార జ్యోతిర్లింగానికి రెండు స్వరూపాలు ఉన్నాయి.ఒకదానిని అమరేశ్వర నామంతో పిలుస్తారు. నర్మదా నది దక్షిణం తీరం లో ఓంకారేశ్వరుని ఆలయం నెలకొని ఉంది.వేరువేరు గా ఉన్న రెండింటిని ఒకటిగానే పరిగనిస్తారు. వీటికో పురాణగాధ ఒకటి ఉంది.
ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గొప్పవారేవరూ లేరని విర్రవీగుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పదని నారదమహర్షి చెప్పగా, కోపితుడై, ఓంకార క్షేత్రానికెళ్ళి శివదేవుని పార్థివలింగాన్ని భక్తితోపూజిస్తూ తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా, వింధ్యుడు ‘స్వకార్యాన్ని సాధించుకునే శక్తిని ప్రాదించమని’ వేడుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వరంలో కొలువై ఉండమని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన స్వామి ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువైయ్యాడు. ఇదిలా ఉండగా, శివుని నుంచి వరాన్నిపొందిన వింధ్యుడు, వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడా అడ్డుతగలసాగాడు. వింధ్యుని చేష్ట వలన సమస్తలోకాలు అంధకారంలొ తల్లడిల్లాయి. అప్పుడు దేవతల మొరలను ఆలకించిన పరమేశ్వరుడు వింధ్యుని గర్వమణచమని అగస్త్యమునిని పురమాయించాడు. అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాద పూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా, తాను తిరిగి వచ్చేంతవరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మరల ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు. ఫలితంగా వింధ్యుడు ఎత్తు పెరలేదు.