Home » Karthika Puranam » Karthika Puranam Part 11

Karthika Puranam Part 11

కార్తిక పురాణం (Karthika Puranam Part 11
11వ అధ్యాయము – మ౦థరుడు – పురాణ మహిమ

ఓ జనక మహారాజా! యీ కార్తిక మాసవ్రతము యొక్క మహత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపూలతో పూజించిన యెడల చాంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనంచేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము అని వశిష్టులవారు ఈ విధముగా చెప్పదొడంగిరి.

పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్యమా౦సాది పానీయములు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతినే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల యిండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండనతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమిపమందున్న ఒక గుహనుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకునిపై బడెను. కిరతకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజాతో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకేకాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవి౦చుచు రక్తము గ్రక్కుచు బాధపడుచు౦డిరి.

మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేయుచు సదాచారవర్తినియై భర్తను తలచుకోని దుఃఖించుచు కాలము గడుపుచు౦డెను. కొన్నాళ్లకు ఆమె యింటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి “స్వామి! నేను దీనురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామస్మరణ చేయుచు జీవించుచున్నదానను, కాన, నాకు మోక్షమార్గము ప్రసాదించు”మని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి “అమ్మా! ఈ దినము కార్తీకపౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొనవచ్చెదను. నీవు ప్రమిదను, వత్తిని తీసికొని రావాలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీవందుకొనుము” అని చెప్పినతోడనే అందుకామె సంతసించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిచేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించినవారినెల్ల “ఆరోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని” చెప్పెను. ఆమె కూడా రాత్రంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంత కాలమునకు మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మెక్కించి వైకుంఠమునకు దీసికోనిపోయిరి. కానీ – ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచము దోషముండుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీసికోనిపోయిరి. అచట నరక మందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను జూచి “ఓ విష్ణుదూతలారా! నా భర్తా, మరి ముగ్గురునూ యీ నరక బాధపడుచున్నారు . కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్దరింపు”డని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు “అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనముపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరక బాధలు పడుచున్నారు”, అని వారి చరిత్రలు చెప్పిరి. అందుల కామె చాల విచారించి “ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురనూ కూడా ఉద్ధరింపు” డని ప్రార్ధించగా, అందులకా దూతలు “అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు, ప్రమిదెఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కల్గిన ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగు”నని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను. అ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తికమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టుల వారు నుడివిరి.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి ఏకాదశాధ్యాయము – పదకొండవరోజు పారాయణము సమాప్తము.

Karthika Puranam Part 5

కార్తిక పురాణం 5వ అధ్యాయము – వనభోజన మహిమ(Karthika Puranam Part 5) ఎల్లశరీర దారులకు నిల్లను చీకటి నూతిలోపలన్ ద్రెళ్లక ‘మీరు మే’ మనుమమతి భ్రమణంబున భిన్నులై ప్రవ ర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణున౦ దుల్లము జేర్చి తారడవిను౦డుట మేలు...

Karthika Puranam Part 16

కార్తీక పురాణం – 16 16వ అధ్యాయము – స్తంభ దీప ప్రశంస వశిష్టుడు చెబుతున్నాడు – “ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసముందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా...

Karthika Puranam Part 10

కార్తిక పురాణం 10వ అధ్యాయము – అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్టుల వారిని గాంచి ” మునిశ్రేష్ఠా! యీ అజామీళుడు యెవడు? వాడి పూర్వ జన్మ మెటువంటిది? పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను? ఇప్పడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన...

Karthika Puranam Part 1

కార్తిక పురాణం 1వ అధ్యాయము – కార్తీక మహత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ మధఖిలా౦డకోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనికాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను....

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!